లండన్: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై మహాత్మా గాంధీ గందరగోళం సృష్టించారని బ్రిటన్లోని లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక వెబ్సైట్ పేర్కొంది. చివరి రోజుల్లో నేతాజీకి సంబంధించిన సమాచారాన్ని వెలుగులోకి తేవడానికి ప్రారంభించిన తీతీతీ.ఇ్యఒళచిజళఒ.జశచ్యి అనే వెబ్సైట్ వివిధ సందర్భాల్లో గాంధీజీ చేసిన ప్రకటనలను ప్రజల ముందుకు తెచ్చింది. తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించారని పేర్కొన్న తేదీ తరువాత అయిదు నెలలకు 1946 జనవరిలో జాతిపిత మహాత్మా గాంధీ.. బోస్ జీవించే ఉన్నారని తాను విశ్వసిస్తున్నానని, సరయిన సమయంలో అతను కన్పిస్తారని ప్రకటించారని ఈ వెబ్సైట్ తెలిపింది. గాంధీ దిగ్గజ నేత కావడం వల్ల ఆయన చేసిన ప్రకటన భారత్, బ్రిటన్లో గందరగోళం సృష్టించిందని తెలిపింది. అయితే అదే సంవత్సరం మార్చి నెలలో గాంధీజీ తన స్వభావం బోస్ జీవించే ఉన్నట్లు విశ్వసించడానికి దారితీసిందని ‘హరిజన్’ పత్రికలో రాశారని ఆ వెబ్సైట్ తెలిపింది. ‘గతంలో నేను చెప్పినదానిని మరచిపోవలసిందిగా నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ముందున్న ఆధారాలను నమ్ముమని, నేతాజీ మనలను విడిచి వెళ్లారనే చేదు నిజాన్ని జీర్ణించుకోవాలని నేను కోరుతున్నాను’ అని గాంధీజీ ఆ పత్రికలో రాశారని ఆ వెబ్సైట్ పేర్కొంది. బోస్ 50వ జన్మదినోత్సవమైన 1947 జనవరి 23న ‘ఆయన (బోస్) తన ఉన్నతమైన తెలివితేటలను, ఉజ్వలమైన భవితను దేశ సేవకోసం త్యాగం చేశారు’ అని గాంధీ పేర్కొన్నారని ఆ వెబ్సైట్ తెలిపింది. బోస్ మరణంపై సంవత్సరాలుగా కొనసాగుతున్న ఊహాగానాలను తిప్పికొట్టడానికి చివరి రోజుల్లో బోస్ కార్యకలాపాలకు, నిర్వహించిన ఉద్యమాలకు సంబంధించిన ఆధారాలతో కూడిన పత్రాలను ఈ వెబ్సైట్ వెలుగులోకి తెస్తోంది.



No comments:
Post a Comment