హైదరాబాద్, జనవరి 2: తెలంగాణలో పర్యటించాలని ప్రధానమంత్రిని ఎన్నిసార్లు కోరినా రావడం లేదని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ప్రధానమంత్రి తెలంగాణకు ఏమిచ్చారో ప్రశ్నించాలని ప్రజలను కోరుతున్నట్టు చెప్పారు. ఇప్పటికి ఆయనను మూడుసార్లు ఆహ్వానించామని, కొత్తరాష్ట్రానికి రావలసిన బాధ్యత ఆయనపై ఉందని ఆయన అన్నారు. ప్రధానిని ఆహ్వానించలేదంటూ బిజెపి నాయకులు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని శంకుస్థాపనకు ప్రధాని హాజరై, కనీసం మట్టి ఇచ్చారని, తెలంగాణ ముఖం ఇంతవరకు చూడలేదని, తెలుగు రాష్ట్రాలకు ఆయన చేసినదేమీ లేదని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ప్రశ్నించాలని ప్రజలను తాము కోరతామని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ భవన్లో శుక్రవారం మీడియాతో ఐటిశాఖ మంత్రి కెటిఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఫలితాలు టిఆర్ఎస్కే అనుకూలంగా వస్తాయని వివిధ సర్వేల్లో తేలిందని తెలిపారు. 18 నెలల పాలనలో ఎలాంటి భావోద్వేగాలు లేకుండా చక్కని పాలన అందించగలిగినట్టు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు సైతం అంగీకరిస్తున్నారని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఫీల్గుడ్ వాతావరణం ఉందని అన్నారు. టిఆర్ఎస్కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమవుతున్నాయంటే మా బలం ఎంత పెరిగిందో అర్ధం అవుతుందని అన్నారు.
ప్రత్యేక మ్యానిఫెస్టో ప్రకటిస్తాం
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం టిఆర్ఎస్ ప్రత్యేక మ్యానిఫెస్టో ప్రకటిస్తుందని తెలిపారు. విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్పై ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలతో కూడిన మ్యానిఫెస్టో విడుదల చేయనున్నట్టు చెప్పారు. 2014 నాటి పరిస్థితి వేరని, అప్పుడు హైదరాబాద్ నగరంలో టిఆర్ఎస్ బలం అంతంత మాత్రమేనని, ఓటర్లు నమ్మలేదని, కానీ పద్దెనిమిది నెలల పాలనతో పరిస్థితి మారిందని, అన్ని ప్రాంతాల ప్రజలు, వర్గాల ప్రజలు టిఆర్ఎస్ను నమ్ముతున్నారని అన్నారు.
బిజెపితోనే గట్టిపోటీ
గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్కు బిజెపినే ప్రధాన ప్రత్యర్థి అని, కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందని అన్నారు. మేయర్ను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలనే డిమాండ్ మంచిదేనని, అయితే గ్రేటర్ ఎన్నికల నిబంధనలో ప్రత్యక్షంగా ఎన్నుకునే వీలు లేదని తెలిపారు. హైదరాబాద్ను విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని, హైదరాబాద్ ఓటర్లు టిఆర్ఎస్కు అండగా నిలవడం ద్వారా మద్దతు ప్రకటించాలని కెటిఆర్ కోరా రు. గ్రేటర్లో ఒంటరిగా పోటీ చేసి 80కి పైగా డివిజన్లు గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో సిఎం పాల్గొంటారని తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తామని. తెలంగాణలో టిడి పి ముగిసిన అధ్యాయం అని, తె లంగాణ టిడిపిని చంద్రబాబు నాయుడే ఖాతరు చేయడంలేదని అన్నారు.



No comments:
Post a Comment