కరాచీ, జనవరి 30: పాకిస్తాన్లోని సింథ్ రాష్ట్రం శక్తివంతమైన బాంబు పేలుడుతో నెత్తురోడింది. షికార్పూర్లోని లఖీదార్ ఏరియాలో మైనార్టీ షియా ముస్లిం తెగకు చెందిన మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా సంభవించిన పేలుడులో పలువురు చిన్నపిల్లలు సహా దాదాపు 61మంది మృతిచెందగా, మరో 50మంది వరకు గాయపడ్డారు. పేలుడు ధాటికి మసీదు పైకప్పు కుప్పకూలడంతో దాని శిథిలాల కింద పలువురు సజీవ సమాధి అయ్యారు. మధ్యాహ్నం ప్రార్థనలు నిర్వహించేందుకు మసీదులోకి ప్రవేశించిన కొద్దిసేపటికే పేలుడు సంభవించిందని, దాడిలో 61మంది మృతిచెందగా, 50మంది వరకు గాయపడ్డారని, వీరిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని సింథ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి జామ్ మెహతాబ్ తెలిపారు. అనుమానిత యువకుడు ఒకరు మసీదులో ప్రవేశించిన తర్వాత పేలుడు జరిగిందని ఇన్స్పెక్టర్ జనరల్ రఖియో మిరానీ తెలిపారు. పేలుడును ఆత్మాహుతి దాడిగా ప్రయివేట్ ప్రసార మాధ్యమాలు పేర్కొన్నాయి. అయితే ఆ విషయం ఇంకా నిర్ధారణ కాలేదు.


No comments:
Post a Comment