జెనీవా, మార్చి 22: అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆహార భద్రత కోసం ఆహార ధాన్యాలను ప్రభుత్వం నిల్వ చేయడం అనే చిక్కు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అమెరికా తాజాగా చేసిన ఒక ప్రతిపాదనను భారత్తో పాటుగా జి-33 గ్రూపు (అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి)లోని పలు దేశాలు ఈ అంశంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ)లో ఈ ఏడాది ఏర్పాటు చేసిన రెండవ అనధికారిక సమావేశంలో తీవ్రంగా వ్యతిరేకించాయి. అమెరికా ప్రతిపాదన వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎలాంటి ఆహార భద్రతా కార్యక్రమాలను అమలు చేయాలో సూచించే స్థితి ఏర్పడుతుందని, ఇప్పుడున్న విధానంలో అలాంటిది లేదని భారత్ పేర్కొంది. ఆహార భద్రత సమస్యను పరిష్కరించేందుకు చేసే ఏ ప్రతిపాదన అయినా ప్రభుత్వమే ఆహార ధాన్యాలను నిల్వ చేసేదిగా ఉండాలని మన దేశం వాదించింది. ఆహార భద్రతా అవసరాల కోసం ప్రభుత్వాలు ఆహార ధాన్యాలను నిల్వ చేయడం అనేది వాణిజ్యానికి ఏలాంటి హాని చేయని లేదా అతి తక్కువ హాని చేసేవిగా ఉండాలని భారత్తో పాటుగా చైనా, ఫిలిప్పీన్స్ లాంటి జి-33 గ్రూపు దేశాలు వాదించాయి. జైనీవాలోని డబ్ల్యుటిఓలో శుక్రవారం ఈ అంశంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండో సమావేశంలో జి-33 గ్రూపు దేశాలు అమెరికా ప్రతిపాదనపై చర్చించాయి. ఈ సమస్యపై సభ్య దేశాల మధ్య ఒక ఒప్పందాన్ని సాధించడం కోసం చేసిన అనేక ప్రతిపాదనల్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు ఆహార భద్రతా కార్యక్రమాలు ఏ మేరకు సమర్థవంతంగా పని చేస్తున్నాయి, వాణిజ్యంపై అవి ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో, ఏ మేరకు లక్ష్యాలను సాధించాయో సమీక్ష చేయడం, డబ్ల్యుటిఓలో ఇప్పుడున్న నిబంధనల కారణంగా ఆహార భద్రతా కార్యక్రమాలను అమలు చేయడంలో ఎదుర్కొంటున్న, ఎదురు కాబోయే సమస్యలను గుర్తించడం, ఆహార ధాన్యాలను నిల్వ చేయడంలో ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను, సిఫార్సులను క్రోడీకరించడం అనే మూడు ప్రధాన అంశాలు ఈ ప్రతిపాదనలో ఉన్నాయి. కాగా, సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలి అనేదే అసలు సమస్య తప్ప కేవలం చర్చలు జరపడం లేదా ఇప్పుడు అమలవుతున్న కార్యక్రమాలను సమీక్షించడానికి అధికారాలను విస్తృతం చేయడం కాదని జి-33 గ్రూపు తరఫున మాట్లాడుతూ ఇండోనేసియా అభిప్రాయపడింది. ఈ సమస్యకు సంబంధించి జి-33 ప్రతిపాదనగా పిలవబడే మరో ప్రతిపాదనను సమర్థించే దేశాలు, వ్యతిరేకించే దేశాల మధ్య విభేదాలు ఈ సమావేశంలో మరింత స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఆహార ధాన్యాలను నిల్వ చేయడానికి ప్రభుత్వం పేద రైతులనుంచి మద్దతు ధర చెల్లించి ఆహార ధాన్యాలను కొనుగోలు చేసే కార్యక్రమాలకు మరిన్ని వెసులులుబాట్లు కల్పించడం కోసం వ్యవసాయ ఒప్పందాన్ని సవరించాలని జి-33 గ్రూపు ప్రతిపాదన సూచిస్తోంది.
సరిహద్దు సమస్యపై
నేడు భారత్, చైనా చర్చలు
బీజింగ్/న్యూఢిల్లీ, మార్చి 22: సరిహద్దు సమస్యలను పరిష్కరించుకునేందుకై భారత్, చైనా సోమవారం న్యూఢిల్లీలో 18వ విడత చర్చలు జరుపనున్నాయి. కేంద్రంలో గత ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఉభయ దేశాల మధ్య ఈ చర్చలు జరగడం ఇదే తొలిసారి. వాస్తవాధీన రేఖ (ఎల్ఎసి)పై స్పష్టతకు రావడంపై ఈ చర్చల్లో భారత్, చైనా దృష్టి సారిస్తాయని భావిస్తున్నారు. ఉభయ దేశాల మధ్య దీర్ఘ కాలం నుంచి నలుగుతున్న సరిహద్దు సమస్యపై భారత ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, జాతీయ సలహాదారు అజిత్ దోవల్ చైనా ప్రతినిధి, స్టేట్ కౌన్సిలర్ యాంగ్ జియెచీతో చర్చలు జరుపుతారు.


No comments:
Post a Comment